న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, దేశ రాజధానిని మరింత పచ్చగా మార్చేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) కీలక అడుగు వేసింది. బాన్సేరా వేదికగా ఆదివారం నిర్వహించిన తొలి ‘డీడీఏ గ్రీన్ ఎక్స్పో 2026’ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘డీడీఏ గ్రీన్స్’ లోగోతో పాటు, 2026 వార్షిక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ప్రజలే పర్యావరణ వారధులు ఈ సందర్భంగా ఎల్.జీ సక్సేనా మాట్లాడుతూ.. “ఈ ప్రదర్శన కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం కాదు.. ఇది ప్రజల భాగస్వామ్యంతో కూడినది. తమ ఇళ్ల వద్ద మొక్కలు నాటుతూ, పక్షులను సంరక్షించే ప్రతి ఢిల్లీ పౌరుడూ పర్యావరణానికి నిజమైన హీరో” అని కొనియాడారు. మూడేళ్ల క్రితం కాలుష్యంతో నిండిన ఈ బాన్సేరా ప్రాంతం, నేడు ఇంత పచ్చగా మారి గ్రీన్ ఎక్స్పోకు వేదిక కావడం గొప్ప మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు.
నగరంలోని పార్కులను కేవలం వినోద కేంద్రాలుగానే కాకుండా, విజ్ఞాన, సాంస్కృతిక వేదికలుగా తీర్చిదిద్దేందుకు డీడీఏ పలు జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
నాటక ప్రదర్శనలు: నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాతో కలిసి పార్కుల్లో నాటక శిక్షణ తరగతులు, ప్రదర్శనలు నిర్వహిస్తారు.
పరిశోధనలు: ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో పట్టణ పర్యావరణంపై విద్యార్థులు పరిశోధనలు చేసే వీలు కలుగుతుంది.
ఔషధ వనాలు: నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు సహకారంతో ఎంపిక చేసిన పార్కుల్లో ఔషధ మొక్కల పెంపకం చేపడతారు.
ప్రకృతి కేంద్రాలు: డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) - ఇండియా ఆధ్వర్యంలో పర్యావరణంపై పౌరులకు అవగాహన కల్పించే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో పెరుగుతున్న వేడి, వరద నిరోధకత, పచ్చని నగరాల నిర్మాణం వంటి అంశాలపై నిపుణులు చర్చిస్తారు. డీడీఏ కేవలం నగరాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, పర్యావరణ సంరక్షకుడిగా బాధ్యత వహిస్తుందని డీడీఏ ఉపాధ్యక్షుడు ఎన్. శరవణ కుమార్ తెలిపారు. ప్రకృతిని, ఆధునికతను జోడిస్తూ ఢిల్లీ భవిష్యత్తును మరింత సుందరంగా తీర్చిదిద్దడమే ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
Comments
Leave a Reply